*నీట్(NEET) క్వశ్చన్ పేపర్ లీకేజీ ...
*లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ ...
* విద్యార్థి సంఘాల ఆందోళనలు... మద్దతివ్వాలంటూ విద్యార్ధులకు, ప్రజలకు విజ్ఘప్తి...
Astranews desk :
దేశ రాజకీయాల్ని కుదిపేస్తున్న నీట్(NEET) క్వశ్చన్ పేపర్ లీకేజీ ఉదంతం తీవ్ర పరిణామాలకే దారితీస్తొంది. పరీక్షా నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఢిల్లీ మారుమోగిపోతుంటే... కొత్తగా ఈ నెల 24న ఏపీ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును సమస్యల్లోకి నెట్టేసిన పేపర్ లీకేజీల సంస్కృతిని అరికట్టాలని ప్రధాన విద్యార్థి, యువజన సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ క్రమంలో ఎపీలోని ప్రధాన విద్యార్ధి సంఘాలైన SFI, PDSU, AISA, NSUI, DYFI, AIYF రాష్ట్ర కమిటీలు ఐక్యంగా పోరాటానికి సిద్ధమయ్యాయి. బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విద్యార్ధులను, ప్రజలను కోరాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అయా పార్టీలు అందోళనలు, నిరసనలు చేపట్టగా, ఎపీలో కాంగ్రెస్, బిజేపిల మధ్య దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో విజయవాడలో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

నీట్ పేపర్ లీకేజీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి స్వచ్ఛందంగా తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. భవిష్యత్తులో లీకేజీలు జరగకుండా అత్యంత పారదర్శకమైన పరీక్షా విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నాయి. లీకేజీల వెనుక ఉన్న అసలు సూత్రధారులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న జరిగే బంద్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యాలు భాగస్వాములై విజయవంతం చేయాలని సంఘాలు కోరాయి.
నీట్ పరీక్ష పేపర్ లీక్, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్తో ప్రారంభమైన నిరసనలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. విద్యార్థులపై అణచివేతకు నిరసనగా ప్రతిపక్షాలు వీధుల నుంచి పార్లమెంట్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించాయి. మంగళవారం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నాయకులు ప్రధానమంత్రి నివాసం బయట ధర్నా నిర్వహించారు. పోలీసులు అఖిలేష్, ప్రియాంక, రాహుల్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, కొద్దిసేపటికే వారిని విడుదల చేశారు.
ఇదిలా ఉండగా సీజేపీ ప్రతినిధి బృందానికి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగియగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని సీజేపీ జనతా పార్టీ ప్రకటించింది.
ఈ నేపధ్యంలోనే ఉద్యమాన్నిమరింత తీవ్రతరం చేసేలా పలు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉపందుకోగా...ఎపీలోను ఇప్పుడు విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. మరి రాను రాను ఉద్యమాలు ఉపందుకుంటుండగా... కేంద్రం మాత్రం మంత్రి రాజీనామా చేసేది లేదన్నట్లుగా వ్యవహరిస్తుంది.