ముంబై :
టీ20 ప్రపంచకప్ లో పసికూన అమెరికాపై భారత బ్యాటర్లు చెలరేగిపోతారనే అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. 300 లోడింగ్.. ఇదీ బలమైన బ్యాటింగ్ యూనిట్ ఉన్న టీమిండియాపై ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకం. కానీ వరుస వీకెట్లు పడటంతో పరిస్ధితి ఒక్క సారిగా మారింది. ముంబై వాంఖడే స్టేడియం మూగబోయింది. అయితే కెప్టెన్ సూర్య అద్భుత పోరాటంతో టీమ్ పోరాడే స్కోరు సాధించింది.
ఏదో అనుకుంటే, ఇంకేదో అయింది. పసికూన అమెరికా టీమ్ పై భారత బ్యాటర్లు చెలరేగిపోతారు, రికార్డు స్కోరు సాధిస్తారని అనుకుంటే.. దారుణమైన బ్యాటింగ్ తో పూర్తిగా నిరాశపరిచారు. డిఫెండింగ్ ఛాంపియన్ గా టీ20 ప్రపంచకప్ లో అడుగుపెట్టిన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ లోనే బ్యాటింగ్ లో చతికిలపడింది. కానీ సూర్యకుమార్ (49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్) అసాధారణ పోరాటంతో ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే చాలు బౌండరీల సునామీ, పరుగుల తుపాను చూస్తాం. కానీ శనివారం (ఫిబ్రవరి 7) మాత్రం అతని బ్యాట్ సైలెంట్ అయిపోయింది. కనీసం ఒక్క రన్ కూడా చేయకుండా, రెండు బాల్స్ కూడా ఆడకుండా ఔటైపోయాడు అభిషేక్ శర్మ. తాను ఆడిన ఫస్ట్ బాల్ కే క్యాచ్ ఇచ్చేసి గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్ చేరిపోయాడు.
బౌలింగ్, ఫీల్డింగ్ అదరగొట్టిన అమెరికా :
ఇండియాతో ఇన్నింగ్స్ లో అమెరికా బౌలింగ్, ఫీల్డింగ్ ను కచ్చితంగా మెచ్చుకోవాల్సింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను కట్టడి చేసేలా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్, ఫీల్డింగ్ తో యూఎస్ఏ అదరగొట్టింది. మరోవైపు ఇండియన్ బ్యాటర్ల తప్పుడు షాట్ సెలక్షన్లతో వికెట్లు పారేసుకున్నారు. ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) కాస్త పరుగులు చేశారు.
ఒకే ఓవర్లో 3 వికెట్లు
తిలక్ వర్మ, ఇషాన్ ఆడుతుండటంతో టీమిండియా రికవరీ అయేలా కనిపించింది. కానీ అమెరికా పేసర్ వాన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లతో టీమిండియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో వాన్.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె (0) వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్య (5) కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో వాంఖడే స్టేడియం ఒక్కసారిగా లైబ్రరీలా మారిపోయింది.
సూర్యకుమార్ పోరాటం
అమెరికాతో మ్యాచ్ లో టీమిండియా పోరాడే చెప్పుకోదగ్గ స్కోరు సాధించిందంటే అందుకు కారణం కెప్టెన్ సూర్యకుమార్ పోరాటమే. సూర్య ఎప్పటిలా మెరుపులు మెరిపించలేదు. బౌలర్లపై విరుచుకుపడలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఎంతో ఓపికతో బ్యాటింగ్ కొనసాగించాడు.
హాఫ్ సెంచరీ
లాస్ట్ ఓవర్లలో సూర్య గేరు మార్చాడు. తనదైన స్టైల్లో బౌండరీలు బాదాడు. ఫోర్ తో 30 బాల్స్ లో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు సూర్య. ఆ తర్వాత చెలరేగిపోయాడు సూర్య. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టిన సూర్యకుమార్.. ఇండియా స్కోరును 160 దాటించాడు. అమెరికా బౌలర్లలో వాన్ 4 వికెట్లు తీశాడు.