• టీ20 వరల్డ్ కప్ లో భారత్ సంచలన విక్టరీ!..
• కివీస్ ఫినిష్.. వరుసగా మూడోసారి కప్ సాధించిన భారత్....
• 96 పరుగుల తేడాతో కివీస్ చిత్తు ...
• సమిష్టిగా రాణించిన భారత్ బ్యాటర్లు, బౌలర్లు...
• భారత జట్టుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోడి...
20 World Cup 2026:
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టీ20 ప్రపంచకప్ను మరోమారు సొంతం చేసుకుంది.
256 పరుగులు భారీ టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు సీఫర్డ్, ఫిన్ అలెన్(9) మూడు ఓవర్లలో 31 పరుగులు చేసి శుభారంభం ఇచ్చారు. అయితే అక్షర్ పటేల్ వేసిన మూడో ఓవర్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రచిన్ రవీంద్ర(1) బూమ్రా వేసిన ఆ తర్వాత ఓవర్లో ఇషాన్ కిషన్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన గ్రెన్ ఫిలిప్(5) అక్షర్ కుమార్ వేసిన ఓ అద్భుతమైన బంతికి బౌల్డ్ అయి డగౌట్ చేరుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చాప్మన్(3)ను హార్దిక్ పాండ్యా బౌల్డ్ చేశాడు.
ఈ క్రమంలో టిమ్ సీఫర్డ్ 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లో ఇషాన్ కిషన్కు బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్, డారిన్ మిచెల్ కాస్త ప్రతిఘటించారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. తర్వాత బుమ్రా వేసిన 16వ ఓవర్లో వరుస బంతుల్లో నిషన్, హెన్రీలను పెవిలియన్ పంపాడు. తొమ్మిదో వికెట్ రూపంలో కివీస్ కెప్టెన్ శాంట్నర్(43) వెనుదిరిగాడు. చివరి వికెట్గా డఫీని అభిషేక్ శర్మ బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ పట్టాడు. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ ఏడు ఓవర్లకే 97 పరుగులు జోడించారు. 17 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత 21 బంతుల్లో 52 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అభిషేక్ శర్మ ఔటైన తర్వాత బరిలోకి ఇషాన్ కిషన్ రావడంతోనే బౌండరీల వరద పారించాడు. సంజూతో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ 89 పరుగులు జోడించి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే కిషన్ 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డక్ అవ్వగా.. హార్దిక్ పాండ్య 18 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే 8 బంతుల్లో 26 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నిషన్కు మూడు వికెట్లు దక్కాయి.

వరుసగా మూడోసారి కప్ సాధించిన భారత్.... :
మూడోసారి ఈ కప్పును భారత్ సొంతం చేసుకుంది. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమిష్ఠిగా రాణించారు. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్ అద్భుత విజయం సాధించింది. 2007లో ఎంఎస్ ధోని నాయకత్వంలో మొదటిసారి పొట్టికప్ సాధించగా, 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండోసారి టీ20 ప్రపంచకప్ను సాధించారు. ఇప్పుడు మూడోసారి 2026 టీ20 ప్రపంచకప్ను సూర్యకుమార్ నాయకత్వంలో టీమిండియా దక్కించుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రాకు దక్కింది.
భారత జట్టుకు ప్రధాని అభినందనలు... :
"ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు! ఈ అద్భుతమైన విజయం అసాధారణ నైపుణ్యాలు, దృఢ సంకల్పం, జట్టు కృషిని ప్రతిబింబిస్తుంది. వారు టోర్నమెంట్ అంతటా అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈ విజయం ప్రతి భారతీయ హృదయాన్ని గర్వంతో, ఆనందంతో నింపింది. శుభాకాంక్షలు, టీం ఇండియా!"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి