AP Liquor case :
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా... ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. వాసుదేవరెడ్డికి ఈ నెల 27వ వరకూ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వాసుదేవరెడ్డిని గుంటూరు జైలుకు తరలించారు
ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ సందర్భంగా వాసుదేవరెడ్డి తరుఫు న్యాయవాది కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సిట్ విచారణకు వాసుదేవరెడ్డి పూర్తి స్థాయిలో సహకరించారని.. ఆయన అప్రూవర్గా మారినట్లు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉందని అన్నారు. ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. వాసుదేవరెడ్డికి రిమాండ్ విధించింది. దీంతో గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డిని తరలించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో వాసదేవరెడ్డి APSBCL ఎండీగా పనిచేశారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో వాసుదేవరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ లిక్కర్ కేసులో వాసుదేవరెడ్డిని ఏ2గా చేర్చారు. రూల్స్కు వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి కొన్ని మద్యం కంపెనీలకు ప్రయోజనం చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారారంటూ అతని తరుఫు న్యాయవాది చెప్తున్న నేపథ్యంలో.. కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అలాగే వాసుదేవరెడ్డి అరెస్ట్ తర్వాత మరికొంతమందికి కూడా నోటీసులు ఇవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి. దీనిపై సిట్ అధికారులు ఎలా వ్యవహరిస్తారనేదీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.