* విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న కొత్త రైల్వే జోన్
* అదే రోజును అపాయింటెడ్ డేగా ప్రకటించే అవకాశం ?
* ఈ నెలాఖరు నాటికి క్లారిటీ ?
Visakhapatnam South Coast Railway Zone :
విభజన హామీకి సంబంధించి త్వరలో ఓ కీలక ముందడుగు పడబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న జోన్ కార్యకలపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ 1న కొత్త రైల్వే జోన్కు అపాయింటెడ్ డేగా ప్రకటించబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కూడా సమాచారం అందినట్లు తెలుస్తొంది. అన్ని సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగానే కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని సమాచారం.
ఉమ్మడి రాష్ర్ట విభజన అనంతరం ... విభజన హామీల్లో భాగంగా ఇంత కాలానికి ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలో భాగంగా కొత్త రైల్వే జోన్కు సంబంధించి అపాయింటెడ్ డేకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని సవ్యంగా జరిగితే కుదిరితే ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే విభజన ప్రక్రియలో భాగంగా.. ఆరు డివిజన్లు విడిపోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్లు మాత్రమే ఉండనున్నాయి. కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు కాబోతోంది.. అందులో కొత్తగా ఏర్పడే విశాఖపట్నం డివిజన్, తూర్పుకోస్తా జోన్లో కొంతభాగం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు కలిపి ఉండబోతున్నాయి.

కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. గత పదేళ్లుగా కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రం నుంచి వినతులు అందజేశారు. గతేడాది ఫిబ్రవరి నెలలో కేంద్ర కేబినెట్ కొత్త రైల్వే జోన్కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రైల్వే జోన్కు జీఎంతో పాటుగా అవసరమైన అధికారుల్ని, మిగిలిన కసరత్తును చేపట్టింది. ఈ మేరకు అవసరమైన సరిహద్దుల్లో మార్పులు చేర్పులు, రైళ్ల నిర్వహణ, ఆదాయ వ్యయాలు వంటి అంశాలపై కసరత్తు చేశారు. ఇప్పుడు అపాయింటెడ్ డేను ప్రకటించే దిశగా అడుగులుపడుతున్నాయి. అలాగే ఆయా డివిజన్లలో మార్పులు, చేర్పులు చేయనున్నారు.
విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం తాత్కాలిక కార్యాలయాన్ని సిరిపురంలో ఉన్న డెక్ భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. అక్కడ రెండు అంతస్తుల్ని లీజు కింద తీసుకున్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ శాశ్వత ప్రధాన కార్యాలయం పనులు కూడా వేగవంతం అయ్యాయి. ముడసర్లోవలో ఏపీ సర్కార్ భూమిని కేటాయించగా.. అక్కడ పనులు ప్రారంభం అయ్యాయి.. గతేడాది జనవరిలో ప్రధాని మోదీ ఈ పనులకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. మొత్తం 54 ఎకరాలను కార్యాలయం కోసం కేటాయించారు. రూ.192 కోట్లతో పరిపాలనా భవనానికి ఖర్చవుతుందని అంచనా వేశారు.. 12 అంతస్తుల్లో భవనం నిర్మిస్తున్నారు.
కొత్తగా ఏర్పాటవుతున్న ఈ రైల్వే జోన్కు ఏప్రిల్ 1న అపాయింటెడ్ డేగా ప్రకటించే అవకాశం ఉండనుండగా, ఇంత తక్కువ సమయంలో పనులన్ని చెయ్యడం ఎలా అన్న చర్చ కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. కానీ త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని.. ఈ నెలాఖరు లోపు కొత్త జోన్ అపాయింటెడ్ డేపై నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. రైల్వే బోర్డుకు తొమ్మిది నెలల క్రితమే డివిజన్ల వారీగా విభజన ప్రక్రియతో పాటుగా మిగిలిన అంశాలపై డీపీఆర్ పంపించారు. ఈ మేరకు విభజన ప్రక్రియను చేపట్టారు. ఈ నెలలోనే అపాయింటెడ్ డే ప్రకటిస్తారని భావిస్తున్నారు. మొత్తం మీద ఇంత కాలానికి విభజన హామీ.. ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరబోతుందని చెప్పవచ్చు.

ఇది వరకే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు జీఎం గా సందీప్ మాథుర్ నియామకం :
విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) జనరల్ మేనేజర్గా (GM) 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ఎస్ఈ అధికారి సందీప్ మాథుర్ (Sandeep Mathur) జూన్ 2025లో నియమితులయ్యారు. అంతకుముందు రైల్వే బోర్డులో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిగ్నల్ మోడరనైజేషన్)గా పనిచేసిన ఆయన, జూలై 1, 2025 నుండి దక్షిణ మధ్య రైల్వే (SCR) అదనపు జీఎం బాధ్యతలను కూడా స్వీకరించారు. ఈయన సిగ్నలింగ్ వ్యవస్థలు, ప్రాజెక్ట్ అమలులో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న అధికారి కాగా, విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ నియామకం ద్వారా విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం అయ్యాయని చెప్పవచ్చు.