Union Budget 2026 :
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది- ఆమె వరుసగా సమర్పించనున్న తొమ్మిదో బడ్జెట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకోవడంతో పాటు పార్లమెంటరీ చరిత్రలో ఓ అరుదైన మైలురాయిగా నిలిచింది.
ఈ పరిస్థితుల మధ్య వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్పై ఏకంగా 49 రూపాయలు పెరిగాయి. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.
తాజాపెంపుతో ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1,740.50 పైసలకు పెరిగింది. కోల్కతా- రూ. రూ. 1,844.50 పైసలు, ముంబై- రూ. 1,692, చెన్నై- 1,899.50 పైసలకు చేరాయి. గత ఏడాది సెప్టెంబర్ 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 51.50 తగ్గించాయి. ఏప్రిల్ 1న ఆరంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ. 41 తగ్గించి వినియోగదారులకు కొంత ఉపశమనం కల్పించాయి. కిందటి నెల వరకు కొనసాగింది. అక్టోబర్ 1వ తేదీన స్వల్పంగా పెరిగాయి. ఒక్కో సిలిండర్పై రూ. 15.50 పైసలను అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరిల్లో వీటి రేట్లు స్వల్పంగా తగ్గినప్పటికీ.. ఇప్పుడు అమాంతం 49 రూపాయల వరకు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గృహ వినియోగం కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ ప్రకారం.. ఢిల్లీ- రూ. 853.00, గుర్గావ్- రూ. 861.5, అహ్మదాబాద్- రూ. 860, జైపూర్- రూ. 856.5, పాట్నా- రూ. 942.5, ఆగ్రా- రూ. 865.5, మీరట్- రూ. 860, ఘజియాబాద్- రూ. 850.5, ఇండోర్- రూ. 881, భోపాల్- రూ. 858.5, లూధియానా- రూ. 880, వారణాసి- రూ. 916.50 పైసలు, లక్నో-రూ. 890.50 పైసలు, ముంబై- రూ. 852.50 పైసలు, పూణే- రూ. 856, హైదరాబాద్- రూ. 905, బెంగళూరు 855.50 పైసలు ఉంటోంది.